తిరుమల : కార్తికమాసంలో టీటీడీ తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా గురువారం తిరుమల వసంత మండపంలో గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని వసంత మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు నల్లూరు వెంకట మోహన రంగాచార్యులు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గోపూజ ముక్కోటి దేవతల పూజాఫలంతో సమానమని అన్నారు.
కార్తిక విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థన, శ్రీసూక్తం, విష్ణుపూజా మంత్ర పఠనం చేశారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లకు తిరువారాధన చేశారు. అనంతరం ఆవు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. భక్తులు గోప్రదక్షిణ చేశారు.
కార్తిక మహా దీపోత్సవ నిర్వహణకు సహకరించండి
విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో నవంబరు 14న టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తిక మహా దీపోత్సవం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన సహకారం అందించాలని టీటీడీ జేఈవో సదా భార్గవి జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జునను కోరారు.గురువారం ఆమె కలెక్టర్ను కలసి కార్తిక మహాదీపోత్సవం నిర్వహణకు చేపట్టిన పనులను వివరించారు. పోలీస్, జీవీఎంసీ, రెవెన్యూ, మత్స్య శాఖ ,అగ్నిమాపక శాఖల నుంచి అవసరమైన సహకారం అందించాలన్నారు.
,