అమరావతి : కరోనా మహమ్మారీ ఇక మన నుంచి దూరమయినట్లేనని జనాలు ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో విశాఖ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు కలవరం చెందుతున్నారు. గత రెండు రోజుల్లో 20కి పైగా కొత్త కేసులు నమోదు కావడం పట్ల జిల్లా అధికారులు అప్రమత్తమై, కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. గురువారం 11 కేసులు నమోదు కాగా శుక్రవాం మరో తొమ్మిది కేసులు నిర్దారణలో వెలుగుచూశాయి.
విశాఖ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడూతూ ప్రస్తుతం 45 క్రియాశిలక కేసులున్నాయని బాధితులంతా ఇంటి వద్ద వైద్యం పొందుతున్నారని వివరించారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. విధిగా మాస్కు ధరించాలని, దూరం పాటించాలన్నారు. మరి కొద్ది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతున్న తరుణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.