అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19 లక్షల మార్కును దాటింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,175 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,02,923కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 3,692 మంది కరోనా బాధితులు ఆ మహమ్మారి ప్రభావం నుంచి రికవరీ అయ్యారు. దాంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 18,54,754కు చేరింది.
ఏపీలో కరోనా మరణాలు కూడా క్రమం తప్పకుండా నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 29 మంది కరోనా బాధితులు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,844కు చేరింది. ప్రస్తుతం అక్కడ కేవలం 35,325 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అయితే రోజురోజుకు అక్కడ కరోనా ప్రభావం తగ్గుతూ వస్తున్నది. అందుకే కేసుల సంఖ్య 18 లక్షల నుంచి 19 లక్షలకు చేరడానికి 22 రోజుల సమయం పట్టింది. అంతకుముందు లక్ష కేసులు కేవలం 7 రోజుల్లోనే నమోదయ్యాయి.