శ్రీశైలం: నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఒక్క శ్రీశైలం డ్యామ్కే 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుండగా.. 65 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. వారం రోజుల్లో రాయలసీమ ప్రాంత అవసరాలను తీర్చేందుకు పోతిరెడ్డిపాడు వైపు నీటిమట్టం విడుదలయ్యే స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నదని శ్రీశైలం డ్యాం అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం శ్రీశైలం నీటిమట్టం దాదాపు 842 అడుగులుగా ఉన్నది. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు పర్యటించి పలు సహాయక చర్యలు తీసుకుంటున్నారు.
డ్యామ్కు 900 టీఎంసీ-అడుగుల కంటే ఎక్కువ నీరు రావడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్ఫ్లో నమోదవడంతో ఆల్మట్టి డ్యామ్ దిగువ ప్రాంతాలకు 1.69 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనికి తోడు జూరాల ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యంలో 78 శాతం నిండటంతో గత 4 రోజులుగా శ్రీశైలం వైపు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్కి వచ్చేసరికి భారీగా వరదనీరు వచ్చి నిల్వ సామర్థ్యం దాదాపుగా నిండిపోయింది. దాదాపు 1.52 లక్షల క్యూసెక్కుల నీటిని డ్యాం నుంచి శ్రీశైలం వైపు నది దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను తుంగభద్ర బోర్డు అధికారులు అప్రమత్తం చేశారు. నది మధ్యలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.
ఇలాఉండగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం ఆయన రాజమండ్రిలో గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా హెచ్ అరుణ్ కుమార్ వచ్చారు. అరుణ్కుమార్, జిల్లా కలెక్టర్ మాధవీలత తదితరులతో కలిసి మంత్రి అంబటి ధవలేశ్వరం బ్యారేజీ వ్యూపాయింట్ నుంచి వరద స్థాయిని పరిశీలించారు. కాలువ గట్లపై లీకేజీలు, కోతల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాదం పొంచి ఉన్న అన్ని గ్రామాల్లోని ప్రజలకు ఖాళీ చేయించాలని ఆదేశించారు.