హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య (Rosaiah) రాజకీయాల్లో అజాత శత్రువుగా ముద్రవేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. రోశయ్య మృతి అత్యంత బాధాకరమని, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆదర్శవాదిని కోల్పోయామని శైలజానాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. గొప్ప పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారన్నారు. వివాదరహితుడిగా నిలిచారని తెలిపారు. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు. రోశయ్య మృతిపట్ల ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు సద్గతులు కలగాలని ఆకాంక్షించారు.
రోశయ్య మృతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలన్నారు. నీతి నిజాయతీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరని రేవంత్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసిందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. ‘ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత. విలువలు, సంప్రదాయాలు కాపాడటంలో రుషిలా సేవలందించారు. రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. వివాద రహితులుగా, నిష్కళంకితులుగా మన్ననలు పొందారు’ అని చెప్పారు.
రోశయ్య మరణం సమకాలిక రాజకీయాలకు తీవ్రమైన నష్టమని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన నిర్వర్తించిన పాత్ర వర్ణనాతీతమన్నారు. ఏ సీఎం దగ్గర పని చేసినా రోశయ్య తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారని, ఆర్థిక శాఖలో అత్యుత్తమ సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. ఆయన అకాల మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
రోశయ్య శివైక్యం చెందడం కలచివేసిందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆధ్యాత్మికతకు రోశయ్య అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారని, ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఆయన తపించారని చెప్పారు. రోశయ్య రాజకీయ ప్రస్థానం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని వెల్లడించారు.