అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 2018-19వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జీతాలకు సంబంధించి జీపీఎఫ్ ఖాతాల నుంచి డీఏ ఎరియర్స్ క్రెడిట్ అయిన విషయంలో గందరగోళం నెలకొని ఉంది. బిల్లులు పాస్ చేయకుండానే డబ్బులు క్రెడిట్ కావడంతో ఉద్యోగ సంఘం నేతలు ఆర్థికశాఖ అధికారుల వద్ద ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి రూ. 800 కోట్లు మాయం అయ్యాయని ఆరోపించారు.
ఆరు నెలలుగా ఇచ్చిన డీఏ ఏరియర్స్ను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుందని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ పేర్కొన్నారు. తమ నగదు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదన్నారు. గతంలోనూ ఇలాగే జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్లీ తిరిగి వేశారని గుర్తు చేశారు. టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్బాబు మాట్లాడుతూ ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు
. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా, వారు దాచుకున్న సొమ్ములు కూడా మాయం కావడం ఏపీలో తప్ప ఎక్కడ జరగదని ఆరోపించారు. జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇదే అంశంపై ఆర్థిక శాఖ అధికారులు స్పందిస్తూ సాంకేతిక సమస్యతో ఈ తప్పిదం జరిగిందని వెల్లడించారు.