అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారివారి ప్రాంతాల్లో వైసీపీ జెండాలను ఎగురవేసి , కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు . తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కేక్ కట్ చేశారు
. తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జెడ్పీటీసీ సుమన్ కుమార్, ఎంపీపీ దివాకర్ రెడ్డి నారాయణవనం మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళి అర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం ఆధ్వర్యంలో మూడేండ్ల సంబరాలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు లో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్డు లో కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాతోపాటు మిగతా చోట్ల వేడుకలు నిర్వహించారు.