తిరుపతి : తిరుమల శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా రూపొందించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఒకరిపై అధికారులు ఫిర్యాదు చేశారు . ప్రతి సంవత్సరం మాదిరిగానే 2022 వ సంవత్సరానికి సంబంధించిన డైరీలను, క్యాలెండర్లను టీటీడీ ముద్రించింది. వీటిని తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాలు, అమెజాన్ సర్వీసెస్, పోస్టల్ శాఖ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచుతుంది.
అయితే 2022 కు చెందిన క్యాలెండర్లను, డైరీలను నిర్ధేశించిన ధరలకు కాకుండా ప్రైవేట్ వ్యక్తి అమెజాన్ ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నాడని ఆరోపణలు రావడంతో టీటీడీ అధికారులు అమెజాన్ సంస్థకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందించిన అమెజాన్ నిర్వాహకులు ప్రైవేట్ వ్యక్తి అమ్మకాలను నిలిపివేశారు. టీటీడీ క్యాలెండర్లను, డైరీలను అధిక ధరలకు కొనుగోలు చేసి నష్టపోవద్దని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు.
నూతన క్యాలెండర్, డైరీలను నిన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు ఆవిష్కరించారు.