అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలపై జగన్ సర్కారు నియమించిన 13 మంది సభ్యుల కమిటీ ఈరోజు ఉదయం రెండోసారి భేటీ అయింది. మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన కమిటీ ఈరోజు ఏపీ సచివాలయంలో నేరుగా భేటీ అయ్యింది. ఈ సమావేశం తర్వాత సినిమా టికెట్ ధరలపై తమ ప్రతిపాదనల్ని సభ్యులు కమిటీకి అందించారు. ఏపీలో సినిమా టికెట్ల దరల నిర్దారణ కోసం నియమించిన కమిటీ హోంశాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భేటీ అయిన సభ్యులు పలు అంశాలపై చర్చించారు. సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు, ఇతర అంశాలపై పలు ప్రతిపాదనలపై కూడా డిస్కషన్ జరిగింది. మరోసారి భేటీ అనంతరం చర్చకు వచ్చిన సిఫార్సులను వచ్చే నెలలో హైకోర్టుకు ప్రభుత్వం అందజేయనున్నది.ఈ అంశాల ఆధారంగా తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.
టికెట్ రేట్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు కమిటీ సభ్యుడు ముత్యాల రాందాస్ తెలిపారు. థియేటర్లలో వసతులు, ఫైర్ సేఫ్టీ నిబంధనలపైనా కమిటీ చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.మరో భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. మరోవైపు టికెట్ రేట్లు తగ్గించాలని ప్రతిపాదన ఇచ్చినట్లు ప్రేక్షకుల సంఘం తరఫున సభ్యురాలిగా ఉన్న గంపా లక్ష్మీ వెల్లడించారు. ఫుడ్ అధిక రేట్లకు అమ్మడం, టాయిలెట్స్ పరిశుభ్రంగా లేకపోవడంపై కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు.
టికెట్ రేట్లు పెంచాలని కమిటీకి సూచించినట్లు ఎగ్జిబిటర్ వేమూరి బాలరత్నం తెలిపారు. రేట్ల తగ్గింపుతో థియేటర్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, 200 కు పైగా థియేటర్లు మూతపడ్డాయని ఆయన వెల్లడించారు. నిబంధనల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని కోరినట్లు ఆయన చెప్పారు.