Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ఏ రోజు ముందు వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారికి సాత్విక బలి నిర్వహించడానికి (కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలు తదితరాలు) తో ఈ కుంభోత్సవం జరపడం ఆనవాయితీ. కుంభోత్సవం నాడు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియగానే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం (29.03.2024) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలు రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించారు. తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు, సహాయ ఈఓ ఎం హరిదాసు తదితరులు పాల్గొన్నారు.