తాడేపల్లి: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నవరత్నాలు- పెదలందరికి ఇంటి నిర్మాణం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, విశాఖపట్నంలో ఇళ్ల పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందించాలని సూచించారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సోమవారం సమీక్ష జరిపి ఇళ్ల నిర్మాణం పనులను అడిగి తెలుసుకున్నారు.
అన్ని రకాల పనులకు నిధులు సక్రమంగా విడుదలవుతున్నాయని, త్వరగా బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. విశాఖలో 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నామని, అక్టోబర్ నెలాఖరుకల్లా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఆప్షన్ త్రీ కింద ఎంపిక చేసిన ఇళ్ల నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, కాలనీల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశామని అధికారులు సీఎం జగన్కు వివరించారు.
15-20 రోజుల్లో మొత్తం 1.4 లక్షల ఇళ్లు సిద్ధమవుతాయని అధికారులు తెలిపిన టిడ్కో ఇళ్ల నిర్మాణంపై కూడా సీఎం జగన్ చర్చించారు. లబ్దిదారులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు అలాగే 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టాల కార్యక్రమాన్ని కూడా ఆయన సమీక్షించారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి 2,03, 920 మందిని అర్హులుగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికే లక్షల మందికి పట్టాలు ఇచ్చామని, మిగిలిన వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షకు ఏపీఎస్హెచ్సీఎల్ చైర్మన్ డీ దొరబాబు, సీఎస్ సమీర్ శర్మ, గృహనిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్షి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్కే విజయ్ ఆనంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీఎస్హెచ్సీఎల్ ఎండీ ఎన్సీసీఎల్ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.