బాపట్ల జిల్లా : సినిమా థియేటర్లను నడిపించేందుకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తప్పనిసరి చేశారు. లైసెన్స్ పొందని సినిమా థియేటర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాలనాయంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణ.. అధికారులతో సమీక్ష సందర్భంగా బాపట్ల జిల్లాలో సినిమా థియేరట్ల లైసెన్సులపై ప్రత్యేకంగా చర్చించారు.
బాపట్ల జిల్లావ్యాప్తంగా 39 సినిమా థియేటర్లు ఉండగా.. 15 థియేటర్లకు మాత్రమే జిల్లా యంత్రాంగం నుంచి లైసెన్సులు ఉన్నాయి. మిగిలిన థియేటర్లకు నోటీసులు ఇవ్వాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణ సూచించారు. 15 రోజుల్లోగా ఆయా థియేటర్ల యాజమాన్యాలు తమ లైసెన్స్ను పునరుద్ధరించనిపక్షంలో వాటిని మూసివేయాలని ఆమె ఆదేశించారు. లైసెన్స్ పునరుద్ధరణపై ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు సినిమా థియేటర్ల యాజమాన్యాలతో చర్చించాలన్నారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఓటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో విఫలమైతే సహించేది లేదని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణ సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఓటర్ల నుంచి వచ్చిన 3,861 పెండింగ్ దరఖాస్తులపై ఆమె ఆరా తీశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటర్ల దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిష్కరించాల్సి ఉంటుందని, ఓటర్ల గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే శ్రీనివాసులుతోపాటు రెవెన్యూశాఖ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.