హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్ఏఎస్) ఇచ్చిన నివేదిక ఆధారం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కంట్లో వేస్తున్న మందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎలాంటి హాని లేదని ఏపీ ఆయూష్ విభాగం స్పష్టంచేసింది. ఆనందయ్య మందు వాడితే కొవిడ్ తగ్గుతుందనడానికి ఎలాంటి నిర్ధారణలు లేవని పేర్కొంది. ఆనందయ్య మందును వాడినంత మాత్రాన ఇతర మందులను ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తిచేసింది. ఏపీ హైకోర్టు కూడా ఆనందయ్య మందును ప్రజలకు ఇవ్వవచ్చని పేర్కొంది. కంట్లో వేసే చుక్కలమందుపై గురువారంలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కరోనాతో రిటైర్డ్ టీచర్ కోటయ్య మృతి
ఆనందయ్య మందుతో తనకు కరోనా నయమైందని ప్రకటించిన విశ్రాంత ఉపాధ్యాయుడు కోటయ్య సోమవారం మృతి చెందారు. కరోనాతో 10 రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్లో కోటయ్య చేరారు. నాలుగురోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందూతూ కన్నుమూశారు. ఆయనకు వైరస్ నిర్ధారణ అయిన సమయంలో ఆనందయ్య మందును తీసుకున్నారు. కోటయ్య ఉదంతంతోనే ఆనందయ్య మందుకు విశేష ప్రచారం లభించింది.