కర్నూలు: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ రెండో రోజు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం రమణ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వారిని ఆలయంలోకి తీసుకువెళ్లి రత్నగర్భ గణపతి, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రత్యేక ధూళి దర్శనం చేయించారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు దేవస్ధానం వేద పండితులు స్వాగతం పలికారు. మహా మంగళహారతి సేవలో పాల్గొన్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమార్చన సేవలో కూడా పాల్గొన్నారు. అక్కడ వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు కంచిమఠంలో జరిగిన చండీ యాగంలో కూడా పాల్గొన్నారు. ఆదివారం రాత్రి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైలానికి వచ్చారు. జస్టిస్ ఎన్వీరమణ దంపతులతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ దంపతులు కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, కలెక్టర్ పీ కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి వీఆర్ కేకే సాగర్, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న తదితరులు పుష్పగుచ్ఛం, పూల మొక్కలు అందజేసి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏవీ రవీంద్రబాబు, ఎస్సీ ఎస్టీ స్పెషల్ జడ్జి వీఎల్ సత్యవతి, మొదటి అదనపు జిల్లా జడ్జి బీ శ్రీనివాస్, ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాష్ తదితరులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంట వున్నారు.