అమరావతి : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అమరావతి భూములకు సంబంధించి ఆధారాలుంటే చూపాలని ఆయనకు సీఐడీ సూచించింది. అమరావతి ప్రాంతంలో ఉన్న అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి గత నెలలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషినల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుతోపాటు కొన్ని ఆధారాలను సైతం సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ డీఎస్పీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా మంగళవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఆర్పీసీ (41) కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణ నిమిత్తం విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని ఆయనకు సూచించింది. ఇదేవిషయంలో మాజీ మంత్రి నారాయణకు సైతం నోటీసులు అందినట్లు సమాచారం.