Chittor SP | ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూర్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. కేవలం గొడవ చేయడానికే చంద్రబాబు పుంగనూరులోకి వచ్చారని రిషాంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో చెప్పారు. పుంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చంద్రబాబు పర్యటన సాగాల్సి ఉందన్నారు. కానీ, గొడవ చేయడానికే పుంగనూరులోకి ప్రవేశించారని చెప్పారు. పోలీసులపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే గొడవకు దిగారన్నారు.
2000 మంది టీడీపీ కార్యకర్తలు బీరు బాటిళ్లు, రాళ్లతో పుంగనూరులోకి ప్రవేశించారన్నారు. పుంగనూరులోకి ప్రవేశించకుండా టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నామని రిషాంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ కక్షలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ పోలీసులపై చూపొద్దన్నారు. 14 మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు రెండు పోలీసు వాహనాలు తగులబెట్టారని రిషాంత్ రెడ్డి తెలిపారు. రాళ్ల దాడిలో 50 మందికి పైగా గాయ పడ్డారని వెల్లడించారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. వారిలో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా అడుగడుగునా ఉద్రిక్తత నెలకొంది. పోలీసు వాహనాలకు టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలపై రాళ్లు, బీరు బాటిళ్లతో దాడి చేశారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు.