తిరుపతి : వర్షాల కారణంగా తిరుపతిలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ సినీనటుడు చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు. వర్షం, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు అభిమాన సంఘాలు చేయూతనందించాలని పిలుపునిచ్చారు. మున్నెన్నడు లేనివిధంగా తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో వర్షంతో ఇబ్బందులు పడలేదని పేర్కొన్నారు.
మానవతాదృక్పదంతో ప్రభుత్వం, రాజకీయపక్షాలు స్పందించి ఆదుకోవాలని, అధికారులు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నటి మంచు లక్ష్మి తిరుపతిలో వరదలపై స్పందించారు. ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భక్తులు తిరుమల సందర్శనను కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ఆమె కోరారు.