కడప: కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పేర్లపై గత నాలుగు రోజులుగా విపక్షం నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, స్వపక్షం నుంచి కూడా ఆందోళనలు ప్రారంభమవడం, అది కూడా సీఎం జగన్ స్వస్థలం అయిన కడప జిల్లాలోనే వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగడం అధినాయకత్వానికి మింగుడుపడటం లేదు. స్వపక్షీయులు చేస్తున్న ఆందోళనలను ముగించేందుకు వైసీపీ సీనియర్ నేతలు రంగం దిగారు.
రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కవి అన్నమయ్య జన్మస్థలమైన రాజంపేటలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. దాంతో స్థానిక వైసీపీ నాయకత్వం ఆరోపిస్తూ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ అంశంపై గందరగోళం సృష్టించడానికి ప్రతిపక్ష టీడీపీయే బాధ్యత వహించాలని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. రాజకీయ మైలేజీ కోసం ప్రజలను టీడీపీ రెచ్చగొడుతున్నదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాయచోటిలో మీడియాతో మాట్లాడారు.
రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడంలో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదని శ్రీకాంత్రెడ్డి స్పష్టం చేశారు. సమస్య పూర్తిగా సంబంధిత ప్లానింగ్ విభాగం అధికారుల ద్వారానే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు, కడప జిల్లాల్లో నివసించే ప్రజల సౌకర్యార్థం, భౌగోళిక పరిస్థితులను బట్టి ప్రణాళికా విభాగం ఈ నిర్ణయం తీసుకుందని శ్రీకాంత్రెడ్డి చెప్పారు.