Chemical Gas Leak | ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లో మరోమారి విషవాయువు లీక్ అయ్యింది. సీడ్స్ దుస్తుల పరిశ్రమలో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో సుమారు 50 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు, వికారంతో స్పృహ కోల్పోయారు. ఈ ఘటనతో సంస్థ యాజమాన్యం అప్రమత్తమైంది. సంస్థ ఆవరణలోనే కొందరికి ప్రాథమిక చికిత్స నిర్వహించగా, మరికొందరిని చికిత్స కోసం సమీప దవాఖానలకు తరలించారు.
గత మే నెల మొదటి వారంలోనూ ఇదే పరిశ్రమలో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో భారీగా మహిళా కార్మికులు అస్వస్థత పాలయ్యారు. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీ, సమీప పోరస్ ల్యాబ్స్ను సుమారు వారం పాటు మూసేసి అధికారులు విచారించారు. హైదరాబాద్లోని ఐఐసీటీతోపాటు ఇతర సంస్థల్లో కెమికల్ గ్యాస్ లీక్పై నివేదికలు తెప్పించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. తదుపరి చర్యలు చేపట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.