తిరుపతి : ప్రతియేట జరుపుకునే పశువుల పండుగలో ఈ సారి అపశృతి దొర్లింది. ఓ ఎద్దు ఓ వ్యక్తిని బలంగా ఛాతిపై దాడి చేయడంతో ఆ వ్యక్తి చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మరణించాడు. తిరుపతి (Tirupati) జిల్లా చంద్రగిరిలో పశువుల పండుగ(Cattle festival) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం కూడా పండుగను నిర్వహించారు. పశువులను అందంగా అలంకరించి వాటిలో జనంలోకి వదిలి ఆ పశువును పట్టుకున్న వ్యక్తికిగాని, సమూహానికి గాని అవార్డు, నగదు ఇవ్వడం జరుగుతూ వస్తుంది.
నడింపల్లి గ్రామానికి చెందిన వెంకటముని అనే వ్యక్తి ఈ పోటీలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపి ఓ ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. వేగంగా వచ్చిన ఎద్దును పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ ఎద్దు వెంకటముని ఛాతిపై బలంగా గుద్దింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.