అమరావతి : ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేశారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడుకు జనాలు రాకుండా ప్రభుత్వం అన్ని విధాలా అడ్డుకుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాదాపు నాలుగు లక్షలకు పైగా జనం మహానాడుకు తరలివచ్చారని ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు.
మహానాడు నిర్వహణకు స్థలమిచ్చిన మండువవారిపాలెం రైతులకు పాదాభివందనాలు , ఒంగోలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా ఉదయం 7 గంటలకు వచ్చిన జనం రాత్రి 7 గంటల వరకు ఉన్నారని తెలిపారు. పోలీసులు వాహనాలను అడ్డుకున్నప్పటికి కాలినడకన కిలోమీటర్లు నడిచి సభా ప్రాంతానికి చేరుకున్నారని అన్నారు.
ఇప్పటికైనా జగన్రెడ్డిలో మార్పు రావాలని , కక్షాపూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. చంద్రబాబును ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం నాయకులను అభినందించారు.