అమరావతి: వైఎస్ జగన్ పాలనలో ( Power deal ) అదానీతో (Adani ) జరిగిన విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అభివర్ణించారు. అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే, ఇంకా కచ్చిత సమాచారం కావాలని అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లేనని ట్విటర్లో (Twitter) ఆరోపించారు.
చంద్రబాబు (Chandra babu) ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు ? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని ప్రశ్నించారు. అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని , తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారని ఎందుకు ఆరోపణలు చేశారని విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడయ్యాడని ఎద్దేశా చేశారు. అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ (FBI) కూడా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందని, అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారని గుర్తు చేశారు .
అధికారం దగ్గర పెట్టుకుని నిజాలు తేల్చాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచారని, కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ఏసీబీని ( ACB ) రంగంలోకి దించకపోవడం అదానీని కాపాడుతున్నారనే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. అదానీపై చర్యలకు భయపడుతున్నారని, మోడీ డైరెక్షన్ లో విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై ఏసీబీని రంగంలోకి దించాలని వైఎస్ షర్మిల సూచించారు.