అమరావతి : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ) పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరోసారి వార్నింగ్ (Warning) ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదును(TDP Membership) ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. మద్యం, ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని సూచించారు. ఎవరైనా ఇసుక దండా చేస్తే తిరుగుబాటు చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఇసుక విధానంలోకి చొరబడి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనేది వైసీపీ(YCP ) కుట్ర చేస్తుందన్నారు. పార్టీకి గ్రామం నుంచి రాష్ట్రం వరకూ పటిష్టమైన యంత్రాంగం ఉందని అన్నారు. నాలుగు దశాబ్దాల్లో ఎన్నో సంక్షోభాలు దాటామని తెలిపారు. మనల్ని అంతం చేయాలని చూసిన వారే కాలగర్భంలో కలిసిపోయారని వివరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్మాని అన్నారు.
గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వారి త్యాగాలను గుర్తించుకుని సముచిత న్యాయం చేస్తామని, పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు ఇస్తున్నామని వెల్లడించారు. ఇటీవల జరిగినవి ఎన్నికలు కాదని రాక్షసుడితో యుద్ధమని వ్యాఖ్యనించారు. దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా రూ. 4వేల పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని స్పష్టం చేశారు.