Chandrababu | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): అనారోగ్య కారణాలపై బెయిల్పై విడుదలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మంగళవారం క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ దవాఖానలో ఆయన కంటి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. మరో వారం రోజులపాటు చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు 50 రోజులకుగా పైగా రాజమండ్రి జైలులో ఉండి గత వారం విడుదలైన సంగతి తెలిసిందే.
ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. చంద్రబాబుకు ఇప్పటికే అనారోగ్య కారణాలతో బెయిల్పై ఉన్నందున విచారణ వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28 వరకు మధ్యంతర బెయిల్ గడువు ఉన్నందున విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై ఉన్న నేపథ్యంలో గడువు పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయబోమని సీఐడీ కోర్టుకు తెలియజేసింది.