హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో రెండు కేసుల్లో స్వల్ప ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఏపీ హైకోర్టు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇన్నర్రోడ్డు కేసుల్లో వచ్చే సోమవారం (అక్టోబరు 16) వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని, అంగళ్లు కేసులో గురువారం వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఏపీలో సంచలనం సృష్టించిన ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో పోలీసులు చంద్రబాబును నిందితుల జాబితాలో చేర్చారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు ఏసీబీ కోర్టు ఈ నెల 19 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.