Kesineni Nani | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిస్థితిని చూస్తే జాలేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేశ్ దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టాడని విమర్శించారు. 2009 ఎన్నికల సమయంలో పంచలూడగొడతా అని అన్నాడు.. ఇప్పుడేమో పాతాళానికి తొక్కేస్తానని అంటున్నాడని చెప్పారు. వైఎస్ జగన్ నిలబెట్టిన అభ్యర్థులపై ఓడిపోయి ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అయినా గ్లాస్ గుర్తును ఓడించడానికి చంద్రబాబు చాలని విమర్శించారు. పవన్ కళ్యాణ్ నిలబెట్టిన 24 మంది అభ్యర్థులను చంద్రబాబే ఓడిస్తాడని ఎద్దేవా చేశారు.
కరోనా సమయంలోనూ ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగన్ అని కేశినేని నాని కొనియాడారు. సంక్షేమం పేరుతో అభివృద్ధి చేయడం లేదని జగన్ను చంద్రబాబు విమర్శిస్తున్నారని అన్నారు. విజయవాడకు చంద్రబాబు వంద కోట్లయినా ఇచ్చాడా? అని నిలదీశారు. డ్రైనేజీ వ్యవస్థ కోసం తాను కేంద్రం నుంచి 400 కోట్లు తెస్తే.. ఆ నిధులను కూడా చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఆ నిధులు అన్నీ తన పలుకుబడి ఉపయోగించి తెచ్చినవే అని స్పష్టం చేశారు. ఈ విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 33 వేల ఎకరాలను చంద్రబాబు రైతుల నుంచి తీసుకున్నాడని కేశినేని నాని ఆరోపించారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, కోర్టు తప్ప ఐదేండ్లలో నువ్వు కట్టిందేంటి? అని చంద్రబాబును నిలదీశారు. తాను వైసీపీలో చేరిన తర్వాత 100కి పైగా సచివాలయాలు ప్రారంభించానని తెలిపారు. అమరావతి కోసం చంద్రబాబు 3 వేల కోట్లు అయినా ఖర్చు చేశాడా? అని ప్రశ్నించారు. ప్రతి గ్రామానికి ఒక సచివాలయం కట్టి జగన్ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు. 80 వేల కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టిస్తున్న వ్యక్తి జగన్ అని కొనియాడారు.