Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రూ.300కోట్లకుపైగా అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు కాగా.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయనను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల బుధవారం వాదనలు వినిపించాయి. దాదాపు మూడుగంటలకుపైగా వాడీవేడీగా వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్ వాదనలు వినిపించారు.
అరెస్టు కక్ష్య సాధింపేనని బాబు తరఫున న్యాయవాదులు వాదించారు. అయితే, ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెల్లడిస్తామని ప్రకటించారు. మళ్లీ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసిన న్యాయమూర్తి.. మరోసారి తీర్పును శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉన్న దృష్ట్యా తీర్పును వాయిదా వేశారు. రేపు హైకోర్టులో క్యాష్ పిటిషన్ లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తానన్నారు. పిటిషన్ లిస్ట్కాకపోతే తీర్పును వెలువరించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.