అమరావతి : ఏపీలోని కాకినాడ శివాలయంలో అర్చకుల(Priests) పై వైసీపీ నాయకుడిపై దాడిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) ఖండించారు. మంగళవారం ఆయన కుప్పం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శివాలయం (Shiva temple) లో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్పై వైసీపీ మాజీ కార్పొరేటర్ చంద్రరావు నిన్న దాడి చేశారు.
ఈ దాడిపై చంద్రబాబు స్పందిస్తూ అర్చకులను కాలితో తన్నడం,కొట్టడం హేయమైన చర్య అని అన్నారు. అర్చకుడంటే దేవుడు, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావిస్తామని, అర్చకుల కాళ్లకు మొక్కే సంప్రదాయం మనదని పేర్కొన్నారు. వైసీపీ నేత (YCP Leader) అధికార మదానికి, సంస్కృతి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునకు ఇది నిదర్శనమని ఆరోపించారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక వరుసగా విగ్రహాలపై దాడులు జరిగాయని, ఒక్క కేసులోనూ నిందితుల పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. నిందితుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.