అమరావతి : ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎన్నికలకు టీడీపీ సమాయత్తం అవుతుంది . ఈ ఎన్నికలకు పార్టీశ్రేణులు సన్నద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎన్నికలకు ఆయన అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. పశ్చిమ రాయలసీమకు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, తూర్పు రాయలసీమ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ పేరును ప్రకటించిన ఆయన విశాఖకు త్వరలో పేరు ప్రకటిస్తామన్నారు.
రానున్న ఎన్నికల్లో వస్తున్న పొత్తులపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పొత్తుల గురించి నేనెక్కడా మాట్లాడలేదని వివరించారు. పొత్తుల గురించి నాయకుల్లో స్పష్టత ఉండాలని సూచించారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వైసీపీ ప్రభుత్వం దుర్మర్గంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై నిలదీసిన వ్యక్తులను, పార్టీలను అణిచివేతకు గురిచేస్తుందని ఆరోపించారు. ప్రజలను ఏలే పాలకులకు విజన్ ఉండాలని, విద్వేషం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో భయంకరంగా విధ్వంస పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.