ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు కుటుంబంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ మనువరాలి ఎంగేజ్మెంట్లో పాతికేళ్ల తర్వాత తోడల్లుళ్లు కలుసుకున్నారు. ఎన్టీఆర్ అల్లుళ్లు అయినప్పటికీ రాజకీయంగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది. ఈ ఇద్దరు అల్లుళ్లు ఉత్తర, దక్షిణ ధృవాల్లా ఉండేవారు. ఎన్టీఆర్ బతికున్నంత కాలం తెలుగు దేశం పార్టీలోనే ఉన్న తోడల్లుళ్లు.. ఆయన చనిపోయిన తర్వాత ఒక అల్లుడు పార్టీని వీడారు. ఇంకో అల్లుడు మాత్రం పార్టీలోనే కొనసాగి సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఈ తోడల్లుళ్లు ఎవరో కాదు.. దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, నారా చంద్రబాబు నాయుడు.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి కూతురి నిశ్చితార్థానికి దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, నారా చంద్రబాబు నాయుడు దంపతులతో కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ వేడుకలో దగ్గుబాటి, చంద్రబాబు సన్నిహితంగా మెలిగారు. ఒకరి గురించి ఒకరు వాకబు చేసుకున్నారు. వీరిద్దరి కలయికతో బాలకృష్ణ కూడా సంతోషంగా కనిపించారు. వీరిద్దరూ కలిసి ఉండాలని బాలయ్య ఎల్లప్పుడూ కోరుకుంటారు. దీంతో ఇద్దరు బావలు కలిసి ఉండటంతో బాలయ్య సంతోషంలో మునిగిపోయారు. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్లో తోడల్లుళ్లు, అక్కాచెల్లెళ్లు కనిపించారు. ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురంధరేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, రెండో కుమార్తె భువనేశ్వరి, ఆమె భర్త చంద్రబాబు, మూడో కుమార్తె ఉమా మహేశ్వరి, ఆమె భర్త కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్.
దాదాపు పాతికేళ్ల పాటు రాజకీయపరమైన విబేధాల కారణంగా దగ్గుబాటి చంద్రబాబుకు దూరంగా ఉన్నారు. అయితే ఇరు కుటుంబాలు కలిసి ఉండేందుకు.. ఒకానొక దశలో దగ్గుబాటి వెంకటేశ్వరావు నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ.. బాబు నుంచి సానుకూల స్పందన రాలేదని సన్నిహితులు చెబుతుంటారు. ఈ రెండు ఫ్యామిలీలు మళ్లీ ఇప్పుడు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీతోనే దగ్గుబాటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పాత ఫోటోలను పరిశీలిస్తే.. ఎన్టీఆర్కు రైట్ సైడ్ దగ్గుబాటి, లెఫ్ట్ సైడ్ చంద్రబాబు ఉండేవారని వారి సన్నిహితులు చెబుతుంటారు.