Babu Fire on Jagan | అమరావతి రాజధానిగా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చెప్పలేదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అభ్యంతరాలు అప్పుడుంటే ఎందుకు చెప్పలేదని చంద్రబాబు నిలదీశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానికి 30 వేల ఎకరాల భూమి అవసరం అని జగన్ నాడు చెప్పలేదా? అని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానం వల్ల అమరావతి ప్రజలు.. రైతులు మూడేండ్లుగా తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఇక్కడే అని చెప్పి అమరావతిలో జగన్ ఇల్లు కట్టుకోలేదా, ఇల్లు కట్టుకుని ప్రజలను నమ్మించలేదా? అని నిలదీశారు.
ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో రాజ్యాంగంలో స్పష్టంగానే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐదేండ్లకు మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారని, ప్రజల ఆస్తులకు ప్రభుత్వం ఒక ట్రస్టీ మాత్రమే అని గుర్తుంచుకోవాలని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయమని ప్రజలు అధికారం ఇచ్చారా? అని వైఎస్ జగన్ సర్కార్ను నిలదీశారు. మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం వైఎస్ జగన్కు లేదని చంద్రబాబు చెప్పారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఆయనకు ఎవరిచ్చారన్నారు.
జగన్మోహన్ రెడ్డి పేరును జగన్ మోసం రెడ్డి అని పెట్టాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి రాజీనామా చేసి మూడు రాజధానుల అంశంపై ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు. సీబీఐ, కోర్టులు స్వతంత్ర వ్యవస్థలని అన్నారు. మండలిని రద్దు చేస్తామంటూ వ్యవస్థపై దాడులు చేశారన్నారు. దేశంలో ఏ కేసునైనా అంతిమంగా దర్యాప్తు చేసే సంస్థ సీబీఐ అన్నారు. కానీ సీబీఐపైనే కేసులు పెడతామనడం ఎంత దారుణం అని చెప్పారు. ఒకవేళ సీఆర్డీఏతో ఒప్పందం చేసుకున్న రైతులు వెనక్కు తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం ఊరుకునేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.