Chandra Babu | ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రానికి పట్టిన వైరస్ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని కోరారు. శనివారం పార్వతిపురం, రంపచోడవరం, మాడగుల అసెంబ్లీ స్థానాల ఇన్చార్జీలతో సమీక్షించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి రోజురోజుకు దినదినగండంగా మారుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతినిత్యం రాష్ట్రంలో వేధింపులు, కబ్జాలు, ఆత్మహత్యలు, కేసులు, కూల్చివేతలు నిత్యకృత్యం అయ్యాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఉపాధి కోల్పోతుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాలు, అక్రమాలతో చాలా మంది జీవితాలను కోల్పోతున్నారని వాపోయారు. బాధల్లో ఉన్న ప్రజానీకానికి ధైర్యం, నమ్మకం కలిగించాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు హితవు చెప్పారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పాలనతో ఇప్పటికే ప్రజలు పూర్తిగా విసిగి పోయారన్నారు.