హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ లావాదేవీలకు సంబంధించి ఏపీ సీఐడీ తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీచేసింది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నిందితుల్ని సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కుంభకోణంలో రూ.27 కోట్ల మేర టీడీపీ ఖాతాల్లోకి వెళ్లినట్టు సీఐడీ ఆరోపించింది. దీనికి సంబంధించిన వివరాలను కోర్టులో సమర్పించింది. టీడీపీకి అందిన రూ.27 కోట్ల మొత్తానికి సంబంధించి జరిగిన లావాదేవీల వివరాలు ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందజేశారు. మరోవైపు స్కిల్ కేసులో సీఐడీ అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఇప్పటికే టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.