శ్రీశైలం : మకర సంక్రమణ సందర్భంగా శ్రీశైల ఆలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు(Sankranthi Brahmotsavams) వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు బుధవారం ఆలయంలో శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేష పూజాకార్యక్రమాలను నిర్వహించారు. యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామి (Chandiswaraswamy) కి ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం(Trisulasnanam ) , మహదాశీర్వచనాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు.
పూర్ణాహుతిలో నారికేళాలు, సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు హోమగుండంలో వేశారు. అనంతరం వసంతోత్సవాన్ని , చండీశ్వరస్వామికి పుష్కరిణిలో అవబృథస్నానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి(Chairman Chakraphani reddy) , కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, సభ్యులు మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో వేదశ్రవణం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేదశ్రవణాన్ని నిర్వహించారు. దేవస్థానం వేదపండితులతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారక తిరుమల, ఇంద్రకీలాద్రి, హైదరాబాద్ నుంచి వచ్చిన 32 మంది వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ వేదపారాయణం గావించారు.