Srisailam | ఈ నెల ఆరో తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు కర్ణాటకలోని పలు ప్రాంతాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలు భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తారు. భక్తులు పాదయాత్ర ద్వారా కూడా ఎక్కువ సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తారు. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం శ్రీశైల మహాక్షేత్ర దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసింది.
భక్తులు సేద తీరడానికి వీలుగా టోల్ గేట్ వద్ద వల బసవవనం, సిబ్బంది వసతి గృహాల దగ్గర గల బాల గణేశవనం, పాతాళ గంగ మార్గంలోని శివదీక్షా శిబిరాలు, ఆలయ పుష్కరిణి వద్ద గల శ్రీ పర్వత వనం, ఆలయ దక్షిణ మాడవీధిలోని రుద్రాక్ష వనం, శివాజీ గోపురానికి ఎదురుగా గల శివాజీవనం తదితర ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేశారు. మాడ వీధిలోనూ చలువ పందిళ్లు వేశారు. కాలిబాట మార్గంలోని వెంకటాపురం, నాగలూటి, దామర్లగుంట, పెద్ద చెరువు, కైలాసద్వారం తదితర ప్రాంతాల్లోనూ చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ డీ పెద్దిరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.