హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసిన వివాదంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడేవాళ్లు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయని స్పష్టం చేశారు. ఇది రీఆర్గనైజేషన్ యాక్టులోనే ఉన్నదని పేర్కొన్నారు. ఏపీపై ఎన్డీయే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని ఆరోపించారు.
తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు ఉంటే న్యాయ నిపుణులతో కమిటీలు వేయాలని సూచించారు. ఆస్తుల పంపకాల విషయంలో పంతాలకు పోవద్దని హితవు పలికారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలను పరిషరించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఏపీ-తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.