తిరుమల : ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు సోమవారం పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారిని తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్ని పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు చేయించారు.
అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రమణప్రసాద్, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.