TDP on Viveka Murder Case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఈ కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డినీ విచారించాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. సొంత బాబాయి అని కూడా చూడకుండా వివేకానంద రెడ్డి హత్యకు అన్ని విధాల జగన్ సహకరించాడని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలున్నాయని తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్రా గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని శంకర్ రెడ్డి తనకు చెప్పాడని దస్తగిరి పేర్కొన్నాడని గుర్తు చేశారు.
హత్య తర్వాత దస్తగిరితోపాటు పలువురు శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లారని, అప్పుడు కూడా తమవారికేమీ సమస్య రాకుండా చూసుకుంటానని ఎర్ర గంగిరెడ్డి హామీ ఇచ్చారని శంకర్ రెడ్డి భరోసా ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నట్టు పట్టాబి తెలిపారు. శంకర్ రెడ్డి మరెవరో కాదని, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడని అన్నారు. వివేకా హత్య జరిగాక అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డి సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపించారు.
వివేకా హత్య జరిగినప్పుడు సాక్షి మీడియా దాన్ని గుండెపోటుగా చిత్రించిందని పట్టాభి పేర్కొన్నారు. సాక్షి మీడియాకు వివేకా గుండె పోటుతో మరణించాడని శంకర్ రెడ్డే చెప్పారని తెలిపారు. ఈ విషయాన్ని సునీత పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. వివేకా హత్య కేసును రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జగన్ మీడియా చేసిందని ఆరోపించారు. వివేకా హత్య కేసు విచారణ సక్రమంగా వేగంగా చేపట్టాలని పలు సార్లు సీఎం జగన్ను సునీత అభ్యర్థించారన్నారు. కానీ సీఎం జగన్ వాటిని ఖాతరు చేయకుండా సునీతకు మానసిక క్షోభ కలిగించారన్నారు.