CBI Notice | కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది.
2019 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరుగడం ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపింది. ఈ కేసులో గంగిరెడ్డి, దస్తగిరి, అవినాశ్ రెడ్డి తదితరులు నిందితులుగా ఉన్నారు. హత్య జరిగిన సమయంలో ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నారు. నాడు విపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై ప్రభుత్వాన్ని నిలదీశారని వార్తలొచ్చాయి. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నెమ్మదించిందని విమర్శలు వినిపించాయి. దస్తగిరి అప్రూవర్గా మారడంతో దర్యాప్తులో వేగం పెరిగింది.
ఈ కేసు దర్యాప్తు విషయమై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు, డాక్టర్ వైఎస్ సునీత పట్టుబడి పోరాటం సాగించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఏపీ బయట దర్యాప్తు జరుపాలని కూడా కోరారు.