అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయానా బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. ఈ కేసులో ఇప్పటికే వివేకానంద రెడ్డి ఇంటి వాచ్మెన్ రంగయ్య వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు రంగయ్య ఇచ్చిన సమాచారం ఆధారంగా అనుమానితులను ఒక్కోక్కరిగా విచారిస్తున్నారు. ఇవాళ కూడా కడప జిల్లా పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు పలువురిని విచారించారు. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరితోపాటు అతడి భార్యను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. పులివెందుల కోర్టుకు సైతం అధికారులు మరోమారు వెళ్లివచ్చినట్లు తెలిసింది. ఈ కేసులో ఇటీవల వివేకానంద రెడ్డి వాచ్మెన్ రంగయ్య విచారించిన సీబీఐ అతడిని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసింది. హత్యలో సుమారు 9 మంది పాలుపంచుకున్నారని, సుపారీ ముఠానే వివేకాను హత్య చేసిందని రంగయ్య సంచలన విషయాలు వెల్లడించారు. ఇందులో ఇద్దరు ప్రముఖుల ప్రమేయం కూడా ఉందని చెప్పిన విషయం తెలిసిందే.