హైదరాబాద్ : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు ఆయనే రాశారంటూ వెలుగులోకి వచ్చిన లేఖ.. ఆయన్ని కొడుతూ.. ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని సీబీఐ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని వెల్లడించింది. అందుకే ఆయన చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందని తెలిపింది. లేఖలోని చేతిరాతను ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో ఫోరెన్సిక్ సైకలాజికల్ విశ్లేషణ (ఎలాంటి పరిస్థితుల్లో లేఖ రాశారో తెలుసుకోవడానికి) చేయించిన సీబీఐ అధికారులు ఆ సంస్థ నుంచి నివేదిక తీసుకున్నారు. ఈ కేసులో ఇటీవల దాఖలుచేసిన అభియోగ పత్రంతో పాటు న్యాయస్థానానికి సీబీఐ సమర్పించింది. వాటిల్లోని ప్రధాన అంశాలు..
లేఖలోని చేతిరాతను విశ్లేషిస్తే .. రాసినప్పుడు పెన్ను, మెదడు మధ్య సమన్వయం లేదని రిపోర్ట్లో తేలిందని సీబీఐ పేర్కొంది. రాసిన వ్యక్తి సొంతంగా రాసినట్లు అనిపించట్లేదని, తీవ్రమైన ఒత్తిడి, బలప్రయోగం మధ్య రాసినట్లు ఉందని, చేతులు వణుకుతుండగా రాసినట్లు కనిపిస్తోందని, అక్షరాలు క్రమ పద్ధతిలో లేవని చెప్పింది. కాగితంపై పెన్ను ఒత్తిడి ఒక్కోచోట ఒక్కోలా ఉందన్నారు. పదాలు, వరుసల మధ్య పొంతన లేదని, అక్షరాల పరిమాణం అంతా ఒకేలా లేదని తెలిపారు. అక్షరాలు కొన్నిచోట్ల చిన్నవిగా, మరికొన్ని చోట్ల పెద్దవిగా ఉన్నాయని వివరించింది.
వివేకానందరెడ్డి అసలైన సంతకంతో సరిపోల్చి చూసినప్పుడు లేఖలోని సంతకం భిన్నంగా ఉందని నివేదికలో తేలిందని సీబీసీ పేర్కొంది. ఆయన తన సంతకంలో తొలుత ఇంటిపేరు చేర్చి వై.ఎస్.వివేకానందరెడ్డి అని పెడతారని, కానీ లేఖలో వివేకానందరెడ్డి అని మాత్రమే అదీ అస్పష్టంగా ఉందని చెప్పింది. సృహలేని పరిస్థితుల్లో లేఖ రాసినట్లు అనిపిస్తోందని, ఆ లేఖ రాసినప్పుడు ఆయన స్వేచ్ఛగా లేరని.. ఆందోళన, ఒత్తిడి మధ్య ఉన్నారని, లేఖ అసంపూర్తిగా ఉందని చెప్పింది.
వివేకా హత్యకు గురైన రోజున (2019 మార్చి 15న) ఆయన మృతదేహం వద్ద ఓ లేఖ లభించిందని, అది ఆయనే రాశారని ప్రచారం జరిగిందని.. అదే రోజు సాయంత్రం కుటుంసభ్యులు దాన్ని పోలీసులకు అందజేశారని పేర్కొంది. అందులో ఏముందంటే ‘నా డ్రైవర్ను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టాడు. ఈ లేఖ రాయటానికి చాలా కష్టమైంది. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టొద్దు. ఇట్లు వివేకానందరెడ్డి’ అని ఆ లేఖలో ఉంది. సీబీఐ అధికారులు వీటిని న్యాయస్థానానికి సమర్పించారు.