అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు నగలు ఎస్బీఐలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన 18 మందిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు గురువారం తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
కేసు వివరాలిలా ఉన్నాయి. జనసేన పార్టీ, పండుబుద్దాల ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలా కుట్ర పూరిత పోస్ట్ లు పోస్ట్ చేయడం, షేర్ చేయడం చేశారు. మరో 16 మంది ఈ దుష్ప్రచారాన్ని తమ ట్విట్టర్ ఖాతాల నుంచి పోస్ట్, షేర్ చేశారు. “తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1500 కిలోల బంగారాన్ని ఎస్బీఐలో తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం. మమ్మల్ని తరువాత కాపాడండి. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. స్వామీ ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా” అని పోస్టు చేశారు.
టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు హిందూ మతానికి చెందిన భక్తుల మనోభావాలను గాయపరిచి, విద్వేషాలు రగిల్చే ఆలోచనతో వీరు ఈ దుష్ప్రచారం చేశారని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలతో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చట్టప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.