అమరావతి: విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ యేడాది నుంచి పదో తరగతి పరీక్ష విధానంలో మార్పులు చేయడంతో దానికి తగ్గట్లుగా విద్యార్థులను సన్నద్దం చేయడానికి గాను ఉపాధ్యాయులకు సెలవును రద్దు చేసింది. ఇదివరకు ఉన్న విధానం కాకుండా పదిలో ఏడు పేపర్ల విధానాన్ని ప్రభుత్వం నూతనం గా తీసుకువచ్చింది .
ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అసాధారణ పరిస్థితుల్లో తప్ప, సెలవులు మంజూరు చేయొద్దని జిల్లా విద్యాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు లేకుండా ఏ తరగతి ఉండకూడదని , పాఠ్య ప్రణాళికపై విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులందరూ ప్రతిరోజూ హాజరయ్యేల చర్యలు తీసుకోవాలని, అన్ని సబ్జెక్టులను కవర్ చేసేలా రోజువారీ ప్రణాళిక చేసుకోవాలని ఆదేశించారు. యూట్యూబ్ ఛానల్స్, దీక్ష పోర్టల్లో ఉండే మెటీరియల్ను వినియోగించుకొని, పునశ్చరణ తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. చదువులో వెనుకబడిన వారిని సబ్జెక్టుల వారీగా గుర్తించాలని, బ్లూప్రింట్ ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని వివరించారు.
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులకు మద్దతు ఇచ్చేందుకు వారిని ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలని, గతేడాది పదోతరగతి ప్రశ్నపత్రాలను సేకరించి, వాటితో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. ఒత్తిడి తొలగించేందుకు వ్యక్తిత్వ వికాసం తరగతులు నిర్వహించాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు ఆదేశాలు అమలులో ఉంటాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు.