AP News | ఏపీలో ఇటీవల జరిగిన పోలింగ్లో ప్రజలు కూటమికే పట్టం కట్టారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో 130 స్థానాల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి గెలుపు కోసం చంద్రబాబుతో పాటు లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి నలుగురు నాలుగు దిక్కులుగా పనిచేశారని తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు పార్టీ పని అయిపోయిందని.. పదవులు అనుభవించిన వారే వెటకారం చేశారని గుర్తు చేశారు. ఈ ఐదేండ్లు టీడీపీ కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం అండగా నిలబడిందని పేర్కొన్నారు.
చంద్రబాబు సీఎంగా అమరావతిలోనే ప్రమాణస్వీకారం చేస్తారని బుద్ధా వెంకన్నత ఎలిపారు. చంద్రబాబు తన ఆత్మకథ రాస్తే అందులో తనకు కచ్చితకంగా ఒక పేజీ ఉంటుందని తెలిపారు. చంద్రబాబు పాదాలను తన రక్తంతో కడిగానని.. ప్రపంచంలోనే ఇలా ఎవరూ చేసి ఉండరని అన్నారు. పార్టీ కోసం నారా లోకేశ్ 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని.. ఈ పాదయాత్ర ద్వారా లక్షలాది మంది అభిమానం సంపాదించారని బుద్ధా వెంకన్న తెలిపారు. నారా లోకేశ్కు ఈసారి పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరారు ఇది తన కోసం అడగడం లేదని.. పార్టీ కోసమే లోకేశ్ను అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే.. పార్టీ బాధ్యతలు లోకేశ్కు ఇవ్వాలని అన్నారు. టీడీపీని కాపాడే శక్తి నారా లోకేశ్కే ఉందని అభిప్రాయపడ్డారు. నారా లోకేశ్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మరో 30 ఏండ్లు టీడీపీకి తిరుగు ఉండదని ధీమా వ్యక్తం చేశారు.