BRS AP Chief Thota | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : ఒక ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసగించి అధికారం చేజికించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం దగా పడిందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని ఏపీ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో గుంటూరు జిల్లాకి చెందిన మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లాం ప్రకాష్, అనంతపురం జిల్లాకి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ `గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం`లో తమ కనీస అవసరాలు తీర్చలేని వైసీపీ ప్రజాప్రతినిధుల్ని ప్రజలు తరిమికొడుతున్నారని గుర్తు చేశారు. సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేండ్ల కాలంలో అన్నీ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యారని చంద్రశేఖర్ ఆరోపించారు. తెలంగాణ మాడల్ అభివృద్ది ఏపీ లో జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.
అనంతపురానికి చెందిన ఎండీ రహమతుల్లా, అలీ అహ్మద్, ఎండి ఇబ్రహీం, న్యాయవాది ఎండి ముజాఫర్ సమీ, నిరసనమెట్ల శ్రీనాథ్, మహ్మద్ హమద్, కురుబ నాగరాజు, సమత ఖాన్, ఎండి సాజిద్ షా, ఎండి మిరాజ్, మొహమ్మద్ ఇర్ఫాన్, ఫిరోజ్ ఖాన్ షేక్ అహ్మద్, నరసరావు పేటకు చెందిన దేవసహాయం సహా పలు జిల్లాల నాయకులు బీఆర్ఎస్లో చేరారు.