అమరావతి : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) భర్త, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ (Brother Anil) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Jagan) పాలనపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పాస్టర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మరి కొద్దిరోజుల్లో ఏపీలో అసెంబ్లీ (Assembly Elections) ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ఏపీకి చీఫ్ గా నియమించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పాస్టర్ల సమావేశంలో అనిల్ మాట్లాడుతూ ‘ బలవంతుడిని ఓడించడానికి దేవుడు ఎప్పుడూ బలహీనులను ఎంచుకుంటాడని’ వ్యాఖ్యనించారు. దేవుని రాజ్యం రావాలని ప్రజలను భూమి మీదకు పంపించాడని అన్నారు. తాను రాజకీయం గురించి మాట్లాడడం లేదని దేవుడు తనకు ఉన్నతమైన పిలుపునిచ్చాడని పేర్కొన్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం రావాలని షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సభలు , సమావేశాలు నిర్వహించారు. నాటి ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లలో 151 సీట్లల్లో గెలుపొంది ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కుటుంబంలో మనస్పర్థాలు రావడంతో షర్మిల జగన్కు దూరంగా ఉంటూ తెలంగాణలో వైస్సార్టీపీ పార్టీ పెట్టి ప్రచారం చేశారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో రెండు నెలల క్రితం పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనడానికి వైఎస్ షర్మిల సరైన నాయకురాలని భావించి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించింది.