Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ఆదివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవశక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదైన శ్రీశైలమహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భ్రామరి సమేతుడైన ముక్కంటీశుడు త్రిశూలధారియై భృంగివాహనంపై విహరించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండోరోజు వైభవంగా సాగాయి. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణాలు శాస్త్రోక్తంగా జరిగాయని ఈవో లవన్న తెలిపారు. సాయంకాలార్చనలు, హోమాల తర్వాత అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన భృంగి వాహనంపై వేంచేబు చేసి షోడశోపచార పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, డప్పుచప్పుళ్లతో క్షేత్ర ప్రధాన వీధుల్లో ఊరేగించారు.
ఉత్సవం గంగాధర మండపం నుండి నంది మండపం వరకు, నందిమండపం నుండి బయలు వీరభధ్ర స్వామి వరకు ఆద్యంతం నయనానందకరంగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవ నృత్యం, బుట్టబొమ్మలు, భీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు,శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు స్వామి అమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది. గ్రామోత్సవంలో ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మెన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈఓ లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, ఫణీంధ్రప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అయన్న, సూపరింటెండెంట్ రవి, స్వాములు, వెంకటేశ్వరులు, మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం ఉదయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం హంస వాహనంపై భక్తులకు గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారని ఈఓ ఎస్ లవన్న తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి భక్తులు విరాళాలు ఇచ్చారు. విశాఖపట్నం వాసి శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి రూ.1.10 లక్షల డీడీని ఏఈవో పణీంధ్ర ప్రసాద్కు అందించారు. హైదరాబాద్ వాసి ఫణి కుమార్.. గో సంరక్షణ నిధికి రూ.1,01,116 విరాళం అందజేశారు.
వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో శ్రీశైలంలో సందడి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో శ్రీగిరి పురవీధులు కికిటలాడాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అర్జిత సేవా టికెట్లు రద్దు చేసి, అందరికీ అలంకార దర్శనం చేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఇరుముడితో వచ్చే శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లో నిర్దిష్ట సమయంలో స్పర్శ దర్శనం అందుబాటులో ఉందన్నారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంతి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధాన ద్వారం వద్ద డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దంపతులకు స్వాగతం పలికి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దంపతులు, ఈవో లవన్న దంపతులు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులుతోపాటు ప్రధాన అర్చకులు వీరయ్యస్వామి మార్కండేయశర్మ పాల్గొన్నారు.