తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం స్వామివారు సూర్యప్రభ(SuryaPrabha) వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారని టీటీడీ అర్చకులు వెల్లడించారు. బ్రహ్మోత్సవా(Brahamotsavam ) ల్లో ఎనిమిదో రోజు బుధవారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుంది .
అదేవిధంగా నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు త్రివిక్రమ అలంకారంలోని శ్రీ మహావిష్ణువు రూపంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉత్సవాల విశిష్టతను వివరించారు. భక్తులను సన్మార్గంలో నడిపించేందుకు సూర్యప్రభ వాహనంపై త్రివిక్రమ అవతారంలోస్వామివారు దర్శనమిచ్చారని చెప్పారు.
తిరుమలలో శ్రీవారి ఆదాయం రూ.3.77 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 27 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 79,974 మంది భక్తులు దర్శించుకోగా 37,052 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చిందని తెలిపారు.