అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో దఫా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఇవాళ సాయంత్రానికల్లా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ శ్లాబ్ల తర్వాత ఉద్యోగుల జీతాల నుంచి ఐఆర్ను రికవరీ చేయడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అన్ని అంశాలపై చర్చ జరుగుతుందని, తమది స్నేహపూర్వక ప్రభుత్వమని మంత్రి పునరుద్ఘాటించారు. శుక్రవారం నాటి చర్చల్లో ఉద్యోగులు తమకు విన్నవించిన సమస్యలను సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులు ఆందోళన విరమించుకునేందుకు వారి సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని, వారి సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపేందుకు కృషి చేస్తామన్నారు. తాము కోరుతున్న కొన్ని కీలక అంశాలపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని, చర్చలు సఫలమయ్యేలా కొనసాగుతున్నాయని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, శనివారంకల్లా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.