కరీంనగర్: మునుగోడు ఉప ఎన్నికతోనే దేశంలో బీజేపీ పతనం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ లోని జిల్లా గ్రంథాలయ సంస్థ ను సందర్శించారు. అక్కడి సదుపాయాలపై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, పాఠకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తన ఉనికిని చాటుకోవడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తమ పార్టీలో చేర్చుకుని ఉప ఎన్నికలకు కారణం అవుతున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పనున్నారని వెల్లడించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఘోరంగా ఓడించేందుకు ఓటర్లు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నలతో అక్కడి ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.
కేంద్రంలో ఇన్నేళ్ల మోడీ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపించారు. రైతుబంధు లాంటి పథకాలను కాపీకొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నా కిసాన్ సమ్మాన్ నిధి కొందరు రైతులకే పరిమితం అయ్యిందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు రైతుబంధు అందేలా కేసీఆర్ ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ కు త్వరలోనే జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుందని వివరించారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, డిప్యూటీ మేయర్ సల్ల స్వరూపా తదితరులు ఉన్నారు.